Andhra Pradesh SIR: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ “ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026” ప్రక్రియను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
జూలై 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించగా, ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను ధృవీకరించేందుకు ఎన్నికల శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు 46,397 మంది బూత్ స్థాయి అధికారులు నియమించబడనున్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన 68,868 మంది బూత్ స్థాయి ప్రతినిధులు కూడా ఎన్నికల సిబ్బందికి సహకరించనున్నారు.
నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్త ఓటర్ల పేర్లు చేర్చడం వంటి అంశాలను పారదర్శకంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
జూన్ 6 నుంచి జూన్ 14 వరకు అధికారులకు శిక్షణ, అవసరమైన దరఖాస్తు పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. అనంతరం జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు.
జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబరు 18 వరకు పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని మార్పులు పూర్తైన తర్వాత సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ బూత్ స్థాయి ప్రతినిధులను నియమించాలని సీఈవో వివేక్ యాదవ్ సూచించారు. ఎన్నికల సిబ్బందికి సహకరించి ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.








