Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నేత అజిత్ పవార్(Ajit Pawar) అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సీనియర్ నేతల సూచన మేరకు అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆయన భార్య, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్ను ముందుకు తీసుకురావాలన్న ఆలోచన బలపడుతోంది.
సునేత్రా పవార్ను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్న ప్రతిపాదనపై పార్టీ లోపల చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బుధవారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన అనంతరం ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలు సునేత్రా పవార్తో సమావేశమై భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా, “అజిత్ దాదా ఆశయాలను కొనసాగించగల వ్యక్తి సునేత్రా పవార్ మాత్రమే” అని మంత్రి నరహరి జిర్వాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మళ్లీ ఏకం అయ్యే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పనిచేయడం దీనికి బలం చేకూరుస్తోంది.
బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడం మహాయుతి కూటమికి తీవ్ర దెబ్బగా మారింది. ఈ పరిస్థితుల్లో సునేత్రా పవార్ నాయకత్వంతో పార్టీ స్థిరత్వాన్ని నిలబెట్టాలని ఎన్సీపీ భావిస్తోంది.
also read:Supreme Court stay on UGC Rules | యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే








