Nasha Mukta Yuva: “డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువతను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ (MY Bharat) తెలంగాణ, ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్–సంకల్ప్ అభియాన్’ను నిర్వహించనుంది.” దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలోని 10 వేలకుపైగా కేంద్రాల్లో కోటి మందికిపైగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ప్రతిజ్ఞ చేయనుంది.
మేడ్చల్–మల్కాజిగిరి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. అదనంగా మరో ఐదు జిల్లాల్లో అవగాహన ర్యాలీలు, యువజన సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరగనున్నాయి. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో చైతన్యం కల్పించడం, డ్రగ్స్కు దూరంగా ఉండే సమాజ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మై భారత్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ చి. అన్వేష్ యువత అంతా ఈ ఉద్యమంలో పాల్గొని ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ALSO READ: Hyderabad Metro | ప్రాణాలను కాపాడిన హైదరాబాద్ మెట్రో.. గ్రీన్ ఛానెల్తో 25 నిమిషాల్లో అవయవాల తరలింపు








