Speed Post Charges: స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖలు, పత్రాలు లేదా పార్శిళ్లు పంపించే వారికి భారత తపాలా శాఖ(India Post) కీలక మార్పులు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ సేవలకు సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కొత్త ధరలతో పాటు ఏ వస్తువును లేఖగా, ఏదిని పార్శిల్గా పరిగణిస్తారో కూడా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తిగత ఉత్తరాలు, ముద్రిత పత్రాలు, గిఫ్ట్ ఐటమ్స్, స్వాగత కిట్లు, పాస్బుక్లు, చెక్బుక్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, అలాగే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేఖల విభాగంలోకి వస్తాయి. 500 గ్రాముల వరకు ఉండే రాఖీ కవర్లు, విక్రయాల కోసం పంపని గ్రీటింగ్ కార్డులు కూడా ఇదే కేటగిరీలో ఉంటాయి.
ఇవి మినహా వ్యాపార సరుకులు, వాణిజ్య ఉత్పత్తులు, ఇతర వస్తువులన్నీ పార్శిళ్లుగా పరిగణించనున్నారు. బరువు, గమ్యస్థానాన్ని బట్టి రూ.38 నుంచి రూ.186 వరకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రత్యేక సేవలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 24 లేదా 48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా ఈ సేవలు కొనసాగుతున్నాయి. కొత్త రేట్లు అమల్లోకి రానుండటంతో స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తువులు పంపే ముందు అవి ఏ కేటగిరీలోకి వస్తాయో తెలుసుకుని బుకింగ్ చేసుకోవాలని తపాలా శాఖ సూచించింది. ముఖ్యంగా బ్యాంకులు, వ్యాపార సంస్థలు తాజా రేట్ల ప్రకారం తమ బుకింగ్లను ప్రణాళిక చేసుకోవాలని తెలిపింది.
ALSO READ: Glasgow Games | తండ్రి బాటలో తనయుడు.. ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు, లోకేశ్








