Stock Market Today: ఐదు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకుని ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారడం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు భారీగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 776.29 పాయింట్లు ఎగిసి 76,835.78 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 229.40 పాయింట్లు లాభపడి 23,995.95 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల మార్కుకు చేరువైంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఇది దిగుమతులపై ఆధారపడే భారత్కు అనుకూల సంకేతంగా మారడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. ట్రేడింగ్లో ఎటర్నల్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి.
ఐటీ, మీడియా, రియాల్టీ, ఫార్మా, మెటల్ రంగాల్లో కొనుగోళ్లు జోరందుకోగా, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్ రంగం మాత్రం ఇతర రంగాలంతగా రాణించలేదు. రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం మెరుగుపడటం, కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలు కూడా మార్కెట్ ర్యాలీకి బలమైన మద్దతు ఇచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ALSO READ: MG Comet EV కొనాలనుకుంటున్నారా? జూలై నుంచి పెరిగిన ధరలు ఇవే








