Pawan Kalyan: బియ్యం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభినందనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యం కిలో రూ.50కు అందుబాటులోకి రానుంది.
ఇందుకోసం 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు అందుబాటు ధరల్లో బియ్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ధరల నియంత్రణపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, మిల్లర్లతో చర్చలు జరిపి ప్రజలకు అనుకూలంగా ధరలు ఖరారు చేయడం మంచి పరిణామమన్నారు. ప్రజల నిత్యావసర ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం పొందాలని సూచించారు.
ALSO READ: Zimbabwe T20 series | హిట్మ్యాన్ స్టైల్లో హిట్టింగ్.. 15 ఏళ్ల వైభవ్ కొత్త చరిత్ర








