నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్( Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీ కి పంపినట్లు తెలిపారు.
విద్యా రంగంలో నెలకొన్న పరిస్థితులు తనను ఆందోళనకు గురిచేశాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వ్యక్తిగత పదవి లేదా ప్రతిష్ఠ కంటే దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆశయాలే ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బాధ్యత స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈ రాజీనామా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థపై ప్రజల్లో తిరిగి విశ్వాసం పెంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణలు, చర్యలు చేపట్టగా, తాజాగా మంత్రి రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Heavy Rainfall | వర్ష బీభత్సం.. నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్








