Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో “క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్” ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ క్వాంటం మిషన్, పీఎన్బీ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగం కోసం ప్రత్యేక క్వాంటం ఫైనాన్స్ హబ్ ఏర్పాటు చేస్తున్న తొలి బ్యాంకుగా పీఎన్బీ నిలిచింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటయ్యే ఈ హబ్ ద్వారా సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక మోసాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడం, భవిష్యత్ డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత సురక్షితంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని పరిపాలనా రాజధానిగానే కాకుండా డీప్ టెక్నాలజీ, క్వాంటం ఇన్నోవేషన్కు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికత అవసరమని, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత కూడా పెరగాలని సూచించారు. పీఎన్బీ సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ ఈ హబ్తో భారత బ్యాంకింగ్ రంగంలో భద్రత, సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణలకు కొత్త దిశ లభిస్తుందని తెలిపారు.
ALSO READ: WhatsApp | స్టేటస్లో పాటలు.. PDF ఎడిటింగ్.. కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లకు సర్ప్రైజ్!








