IMD Forecasting: దేశంలోని వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు ఇస్రో ఉపగ్రహాల తాజా డేటా వెల్లడిస్తోంది. ఇస్రోకు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు పంపిన తాజా చిత్రాల ప్రకారం దేశంలోని దాదాపు 70 శాతం భూభాగం మేఘావృతమైంది. ముఖ్యంగా బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మేఘాలు 12 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు గుర్తించారు. Cloud Top Brightness Temperature (CTBT) విలువలు మైనస్ 60 నుంచి మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవడం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతం నుంచి తేమగాలులు బలంగా వీస్తుండటంతో మాన్సూన్ ట్రఫ్ చురుకుగా మారిందని, ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు పలు ఉత్తర రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేయగా, రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు INSAT-3DS వాటర్ వేపర్ చిత్రాల్లో ఉత్తర, మధ్య భారతదేశంపై తేమ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మేఘాల తీవ్రత తగ్గే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదని ఇస్రో విశ్లేషణ స్పష్టం చేసింది.
ALSO READ: Stock Markets | ఇన్వెస్టర్లకు నిరాశ.. రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్








