UPI payment: డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ సేవలు మరింత విస్తరించనున్నాయి. ప్రస్తుతం చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి చోటా UPI ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా PoS యంత్రాల వద్ద UPI చెల్లింపులు చేసే అవకాశం కల్పించడమే ఈ కొత్త విధానం లక్ష్యం. ఈ ఆఫ్లైన్ UPI సదుపాయం 2026లో ఎంపిక చేసిన PoS టెర్మినల్ పరికరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. NFC సాంకేతికత ఆధారంగా ఈ విధానం పనిచేయనుంది.
NFC సపోర్ట్ ఉన్న మొబైల్ ఫోన్ను ఆఫ్లైన్ PoS టెర్మినల్పై ట్యాప్ చేయడం ద్వారా వినియోగదారులు రూ.2 వేల వరకు చెల్లింపులు చేయగలుగుతారు. విమానాల్లో, భూగర్భ మెట్రో మార్గాల్లో, ఇంటర్నెట్ లేదా మొబైల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా ఇంటర్నెట్ ఉన్న సమయంలో UPI Lite వాలెట్లో డబ్బు జమ చేసుకోవాలి. ఆ తర్వాత నెట్వర్క్ లేకున్నా అదే బ్యాలెన్స్తో చెల్లింపులు చేయవచ్చు. ఈ లావాదేవీలకు ప్రతిసారి UPI PIN నమోదు అవసరం ఉండదు.
ఆఫ్లైన్ చెల్లింపులను అందించేందుకు PoS తయారీ సంస్థలు NPCI నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. లావాదేవీ వివరాలను టెర్మినల్ తాత్కాలికంగా నిల్వ చేసి, నెట్వర్క్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థకు పంపి ధృవీకరణ పూర్తి చేస్తుంది. బ్యాంకులు, UPI యాప్ సంస్థలు కూడా ఈ కొత్త సదుపాయానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేపడుతున్నాయి.
ALSO READ: Balkampet Renuka Ellamma | వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం.. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం








