Pawan Kalyan: శ్రీహరికోట నుంచి జరిగిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్గా గుర్తింపు పొందిన విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం అంతరిక్ష సాంకేతికతలో భారత్ సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని, ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను మరింత పెంచే అడుగుగా అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేసిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ బృందాలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ విధానాలకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. విక్రమ్-1 ప్రయోగం కేవలం రాకెట్ను అంతరిక్షంలోకి పంపడం మాత్రమే కాదని, భారతీయ శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం, యువత సృజనాత్మకతకు ప్రతీక అని పవన్ అన్నారు. ధైర్యం, పట్టుదల, కొత్త ఆలోచనలతో భారతీయులు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరనే నమ్మకాన్ని ఈ విజయం ప్రపంచానికి చాటిందన్నారు. భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తిగా నిలిచి, అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








