Chandrababu Naidu: రాష్ట్రంలో సాగునీటి రంగాభివృద్ధికి కేఎల్ రావు చూపిన మార్గమే ఆదర్శమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి(Krishna- Godavari) సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చిన అనంతరం, కేఎల్ రావు 124వ జయంతి(KL Rao 124th Birth Anniversary) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేఎల్ రావు స్ఫూర్తిని ప్రతి గ్రామానికి చేర్చేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, హీరాకుడ్, కోసీ వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో కేఎల్ రావు విశేష సేవలందించారని, డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీలను ఆధునీకరించి వ్యవసాయానికి కొత్త ఊపునిచ్చారని గుర్తుచేశారు.
పట్టిసీమ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చినప్పటికీ రైతుల ప్రయోజనాల కోసమే దాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. 2015 నుంచి 2025 వరకు పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని, ఈ నీరు లేకపోతే డెల్టా పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ప్రతి ఏడాది వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని, నదుల అనుసంధానం ద్వారానే దేశ జలవనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చని చెప్పారు.
అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించిన సీఎం, రాయలసీమ ఎడారిగా మారకుండా భూగర్భ జలాల పెంపు, సాగునీటి ప్రాజెక్టుల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కేఎల్ రావు కలలుగన్న గోదావరి-కావేరి నదుల అనుసంధానం భవిష్యత్తులో దేశానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
Chandrababu Naidu | పట్టిసీమ లేకుంటే కృష్ణా డెల్టా పరిస్థితి దారుణం: సీఎం చంద్రబాబు
-








