NASA Astronaut: భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. కజకిస్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ ప్రయోగం రాత్రి 8:17 గంటలకు జరగనుంది.
సుమారు ఎనిమిది నెలల పాటు కొనసాగే ఈ మిషన్ ముగిసిన అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆయన భూమికి తిరిగి రానున్నారు. ఈ మిషన్లో అనిల్ మీనన్తో పాటు రష్యాకు చెందిన వ్యోమగాములు ప్యోటర్ డబ్రోవ్, అన్నా కికినా కూడా పాల్గొంటున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం నివసించే వ్యోమగాముల ఆరోగ్యం, శారీరక మార్పులు, వైద్యపరమైన సవాళ్లపై అధ్యయనం చేయడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా ఉంది.
భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహం వంటి సుదూర అంతరిక్ష యాత్రలకు ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నాయి. ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమాల్లో స్పందించిన అనిల్ మీనన్, ఈ చారిత్రక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచిన నాసా బృందానికి, కుటుంబ సభ్యులకు, సహచరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు మూలాలు ఉన్న అనిల్ మీనన్ తండ్రి శంకరన్ మీనన్, తల్లి ఎలిజబెత్ సమోయ్లెంకో. వైద్యుడిగా, మెకానికల్ ఇంజనీర్గా, యూఎస్ స్పేస్ ఫోర్స్ ఫ్లైట్ సర్జన్గా, హెలికాప్టర్ పైలట్గా సేవలందించిన ఆయన అనంతరం నాసా ఆస్ట్రోనాట్గా ఎంపికయ్యారు. అనిల్ మీనన్ అంతరిక్ష యాత్రతో పాలక్కాడ్ జిల్లా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో దేశానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులను అందించిన ఈ ప్రాంతం, ఇప్పుడు మరో అంతరిక్ష మైలురాయికి వేదికగా నిలిచింది.
NASA Astronaut | భారత్ గర్వించే క్షణం.. అంతరిక్షంలోకి మరో భారతీయుడు, అతను ఎవరంటే ?
-








