Lord’s Test: లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు అరుదైన విజయాన్ని అందుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మూడు రోజుల ఆట ముగిసే సరికి టీమిండియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలవాలంటే ఇంకా 327 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు నమోదు చేసి బలమైన స్కోరు సాధించింది. అనంతరం కచ్చితమైన బౌలింగ్తో ఇంగ్లండ్ను 170 పరుగులకే కట్టడి చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 341/7 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో యస్తికా భాటియా అద్భుత సెంచరీతో మెరిసింది. 113 పరుగులు చేసిన ఆమె లార్డ్స్లో టెస్టు సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. స్మృతి మంధాన 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, రిచా ఘోష్ అజేయ అర్ధశతకంతో జట్టుకు భారీ స్కోరు అందించింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. క్రాంతి గౌడ్ మరోసారి తన బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బతీస్తూ కీలక వికెట్లు సాధించింది. సాయలి సాత్ఘరే, స్నేహ్ రాణా కూడా అద్భుతంగా రాణించి వరుసగా వికెట్లు తీసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టారు. వికెట్కీపర్ ఏమీ జోన్స్ మాత్రమే అర్ధశతకంతో పోరాడినా జట్టును గట్టెక్కించలేకపోయింది. నాలుగో రోజు భారత్కు విజయానికి నాలుగు వికెట్లు మాత్రమే అవసరం. బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే లార్డ్స్ వేదికగా భారత మహిళల జట్టు చారిత్రాత్మక టెస్టు విజయాన్ని నమోదు చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.
ALSO READ: Crude Oil Prices | ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన ప్రపంచ చమురు ధరలు








