తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ(Malla Reddy Deemed University) ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్లు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నానని పేర్కొన్న మల్లారెడ్డి, తిరుపతిలో ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలా కాలంగా తన మనసులో ఉందన్నారు. గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఈ సంకల్పం నెరవేరాలని ప్రార్థించానని, ఇప్పుడు ఆ కోరిక ఫలించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రేణిగుంట సమీపంలో ఇప్పటికే ఉన్న పాత విద్యాసంస్థ భవనాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.
తిరుపతి వంటి విద్యా, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన నగరంలో అత్యున్నత విద్యా సంస్థను ఏర్పాటు చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా మరో అంశం చర్చకు దారితీసింది. తిరుమల ఆలయం వెలుపల మల్లారెడ్డి విద్యాసంస్థలకు సంబంధించిన ప్రచార కరపత్రం ప్రదర్శించబడినట్లు కనిపించడంతో వివాదం నెలకొంది. ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ సంస్థల ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలపై నిబంధనలు ఉన్న నేపథ్యంలో దీనిపై భక్తులు, పలువురు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.








