PM Narendra Modi: క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కావని, దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో కలిసి ఆక్లాండ్లో నిర్వహించిన ‘స్పోర్టింగ్ షోకేస్’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడా అనుబంధానికి వందేళ్ల చరిత్ర ఉందని గుర్తు చేసిన మోడీ, ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త మార్పులు, వినూత్న పరిజ్ఞానం క్రీడల అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుస్తున్నాయని, యువ క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటుకునే వేదికలను విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లోనూ ఆయన పంచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడల ద్వారా దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు భారత్ కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా మోడీ క్రీడల ద్వారానే దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. మెల్బోర్న్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా ప్రీమియర్ జెసింటా అలన్తో కలిసి పాల్గొన్న ఆయన, యువ క్రీడాకారులతో సమావేశమై వారిని ప్రోత్సహించారు. క్రీడా రంగంలో పరస్పర సహకారం మరింత విస్తరించే అవకాశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
అదే పర్యటనలో భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్మ్యాప్ను కూడా ప్రారంభించారు. క్రీడలు, యువత భాగస్వామ్యం, సాంస్కృతిక మార్పిడి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో కలిసి పనిచేయడం ద్వారా రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని మోడీ అభిప్రాయపడ్డారు. భారత్లో జరగనున్న అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ఒలింపిక్స్ వంటి సందర్భాలు ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలను కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి వేదికగా మలచాలన్నదే భారత లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.








