Hormuz: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమన్ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్ ప్రయాణాన్ని ఇరాన్ భద్రతా బలగాలు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించినట్లు అంతర్జాతీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఒమన్ కారిడార్ను ఉపయోగించకుండా హర్మూజ్ జలసంధిలో తమ నియంత్రణలో సూచించిన మార్గాన్నే అనుసరించాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలపై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్ పరిసరాల్లో మొత్తం తొమ్మిది భారత ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం వెలువడింది. ఈ నౌకల్లో సుమారు 198 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ట్యాంకర్లు ముడి చమురు, మరికొన్ని సహజవాయువు రవాణా చేస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలను భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నౌకల్లో ఉన్న భారతీయుల భద్రత, సముద్ర రవాణా అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. హర్మూజ్ ప్రాంతంలో పరిస్థితులు ఎలా మారతాయన్నదానిపై ప్రపంచ ఇంధన మార్కెట్లు కూడా దృష్టి సారించాయి.








