Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeNationalICRISAT | రైతులకు శుభవార్త.. అధిక దిగుబడినిచ్చే రెండు కొత్త వేరుసెనగ రకాలు విడుదల

ICRISAT | రైతులకు శుభవార్త.. అధిక దిగుబడినిచ్చే రెండు కొత్త వేరుసెనగ రకాలు విడుదల

-

Chat on WhatsApp

ICRISAT: వేరుసెనగ సాగు చేసే రైతులకు ఉపయోగపడేలా, అధిక దిగుబడితో పాటు నాణ్యమైన నూనె ఉత్పత్తిని అందించే రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలను హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) విడుదల చేసింది. ఐసీజీవీ181030, ఐసీజీవీ201214 పేర్లతో అభివృద్ధి చేసిన ఈ రకాలు వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలను తీసుకురానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ వేరుసెనగ రకాలను అభివృద్ధి చేయడానికి ఇక్రిశాట్, కర్ణాటకలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఐదేళ్లపాటు పరిశోధనలు నిర్వహించాయి.ఆ తర్వాత భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పనిచేస్తున్న అఖిల భారత వేరుసెనగ సమన్వయ పరిశోధన ప్రాజెక్టు కమిటీ ఈ వంగడాలను అధికారికంగా ఆమోదించింది. హైఓలిక్ వేరుసెనగల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఓలిక్ ఆమ్లం అధికంగా ఉండటం ప్రత్యేకత.

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రకాల నుంచి తీసే నూనె ఎక్కువకాలం నిల్వ ఉండటంతో పాటు ఆక్సీకరణకు తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఆహార పరిశ్రమలకు కూడా ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఐసీజీవీ181030 భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి హైఓలిక్ వేరుసెనగ రకంగా నిలిచింది. వానాకాల సాగుకు అనువైన ఈ రకం ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేయవచ్చు.

సంప్రదాయ రకాలతో పోలిస్తే 7 నుంచి 12 శాతం వరకు ఎక్కువ దిగుబడి ఇవ్వగలదు. మరోవైపు ఐసీజీవీ201214 రకం ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఇందులో ఓలిక్ ఆమ్లం, నూనె శాతం, ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండటంతో పాటు సాధారణ రకాల కంటే సుమారు 19 శాతం వరకు ఎక్కువ దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశీయ వంటనూనె ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఈ కొత్త రకాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

nara lokesh visits tirumala and attends engagement ceremony in tirupati

Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. అనంతరం టీడీపీ నేత ఇంటికి

Tirumala: తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి నారా లోకేశ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన నారా లోకేశ్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల...
- Advertisement -
Chat on WhatsApp