Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టైన ఎనిమిది మంది నిందితులను ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. కోర్టు ఆదేశాల మేరకు వారు జూలై 13 వరకు జైలులో ఉండనున్నారు.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నిందితులను కస్టడీలో ఉంచితేనే కీలక ఆధారాలను సేకరించే అవకాశం ఉంటుందని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్తో పాటు అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్ నిందితులుగా ఉన్నారు. వీరు ఆలయానికి వచ్చిన నగదు విరాళాలు, విలువైన కానుకల లెక్కింపు, నిర్వహణకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించి సుమారు రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానాల నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కొందరు బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉండొచ్చనే అనుమానంతో ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా విధివిధానాల ప్రకారం పిటిషన్ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని సూచించింది. ఇదే సమయంలో ఈ వ్యవహారం ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండగా, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
Ayodhya Ram Temple | అయోధ్య ఆలయ నిధుల కేసులో కీలక మలుపు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
-








