Idupu Kayitham: టాలీవుడ్లో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదంపై సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ఈ అంశాన్ని అనవసరంగా పెద్ద రచ్చగా మారుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు భాషలోని తెలంగాణ మాండలిక పదాలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని వివాదం సృష్టించడం సరైంది కాదని నరేశ్ పేర్కొన్నారు. భాషా వైవిధ్యం ఒక సంపద అని, ప్రతి మాండలికానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇతర భాషల్లోని పదాలు, భావాలు పూర్తిగా అర్థం కాకపోయినా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారని, ఉదాహరణకు ‘కాంతార’, ‘కరుప్పు’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు విశేషంగా స్వీకరించారని ఆయన అన్నారు. అలాంటప్పుడు ఒక తెలుగు టైటిల్ను వివాదాస్పదం చేయడం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు భౌగోళికంగా, రాజకీయంగా విభిన్నంగా ఉన్నప్పటికీ భాష పరంగా ఒక్కటేనని నరేశ్ భావోద్వేగంగా తెలిపారు.
“మనమంతా ఒకే రక్తం – తెలుగు” అనే భావనను ఆయన బలంగా వ్యక్తం చేశారు. భాషలు క్రమంగా కనుమరుగవుతున్న ఈ కాలంలో మనమే మన భాషను దెబ్బతీయడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఈ వివాదాన్ని తెలుగు భాషా సంఘం పరిశీలించి సరైన పరిష్కారం చూపాలని నరేశ్ సూచించారు.
Idupu Kayitham | ‘మనమంతా ఒకే తెలుగు రక్తం’.. ఇడుపు కాయితం వివాదంపై నరేశ్ కీలక సూచనలు
-








