Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఖర్గే, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీలు, పార్టీ కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎగువ సభలో మరింత బలంగా ప్రస్తావించడమే తన ప్రధాన బాధ్యతగా కొనసాగుతుందని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన తాజా బులెటిన్లో మల్లికార్జున ఖర్గేను ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించింది. ఆయన పదవీ కాలం జూన్ 25తో ముగిసినప్పటికీ, తిరిగి ఎన్నిక కావడంతో జూన్ 26 నుంచి ఆయనను ప్రతిపక్ష నేతగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ హోదా ప్రకారం ఆయనకు అందే జీతభత్యాలు, సౌకర్యాలు చట్టబద్ధంగా అమలులోకి వస్తాయని పేర్కొంది.
ఖర్గే 2020లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెండోసారి కూడా ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన దీర్ఘ రాజకీయ జీవితంలో 9 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు లోక్సభ ఎంపీగా సేవలందించారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఆయన పాత్రపై కాంగ్రెస్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
Mallikarjun Kharge | రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణం.. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు
-








