Supreme Court: ఆధార్ వినియోగ దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించాలంటూ దాఖలైన ఈ పిటిషన్పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది అశ్వినీ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆధార్ కార్డును పౌరసత్వం, నివాసం లేదా స్థానికతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆధార్ను కేవలం ఐడీ ప్రూఫ్గా మాత్రమే వినియోగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ఆధార్ను పౌరసత్వ నిర్ధారణకు ఉపయోగించకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. అయినప్పటికీ వయస్సు ధ్రువీకరణ, పుట్టిన తేదీ నిర్ధారణ, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఆస్తుల కొనుగోలు, బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు వంటి అనేక సందర్భాల్లో ఆధార్ దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.
అలాగే కొత్త ఓటర్ నమోదు ఫారమ్-6లో కూడా ఆధార్ను పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణగా ఉపయోగించడం చట్టానికి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆధార్ను పౌరసత్వానికి సంబంధించిన పత్రంగా పరిగణించరాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, అవి సరిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.
ఆధార్ వినియోగంపై దేశవ్యాప్తంగా ఏకరూప నిబంధనలు తీసుకురావాలని, దుర్వినియోగం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు.








