Breakfast Scheme: సమ్మర్ హాలిడేస్ అనంతరం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి మళ్లీ సందడి మొదలైంది. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఆహ్వానకరమైన వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. పలు పాఠశాలల్లో తరగతి గదులను ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. దీంతో స్కూళ్లలో తొలి రోజు సందడి నెలకొంది.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అల్పాహార పథకాన్ని(Breakfast Scheme) కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, సుమారు 1.44 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన సబ్జెక్ట్ నిపుణులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నారని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.








