Singareni: సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును పాత విధానంలోనే పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మెడికల్ బోర్డులో అవకతవకలు, మధ్యవర్తిత్వం వంటి సమస్యలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు వేగంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే రేపు (శనివారం) మంచిర్యాలలో 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
సింగరేణిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు మొత్తం 2,657 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇందులో 2,102 కారుణ్య నియామకాలు, 555 ప్రత్యక్ష నియామకాలు ఉన్నాయని వివరించారు. కారుణ్య నియామకాల కోసం వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా సదుపాయాన్ని రూ.1.25 కోట్లకు పెంచినట్లు తెలిపారు. అదనంగా రూ.10 లక్షల సహజ మరణ బీమా కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా, బోనస్ వంటి ప్రయోజనాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో సింగరేణి కార్మికులకు రూ.1,500 కోట్ల లాభాల వాటా పంపిణీ చేసినట్లు వివరించారు.
సింగరేణి ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త బొగ్గు బ్లాకులను సాధించి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ALSO READ: Mallareddy | విద్యార్థులతో క్రికెట్ ఆడి ఆకట్టుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి








