Palamuru-Rangareddy: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను ఆయన మంత్రులు, అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ–1లో జరుగుతున్న నిర్మాణ పనులను సమీక్షించారు. అక్కడ హెడ్ రెగ్యులేటర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే డెలివరీ సిస్టర్న్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి పనుల నాణ్యత, వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
తరువాత నార్లాపూర్ ముంపు గ్రామాల ప్రజలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిహారం చెల్లింపులో జాప్యం వంటి అంశాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Palamuru-Rangareddy | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్ ఆదేశం
-








