Mohammed Azharuddin: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజహారుద్దీన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్–2047” విజన్తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సాధికారత, రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు జంబో చెక్కులు అందజేసిన మంత్రి, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.








