Ajay Kochhar: భారత నౌకాదళంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చార్ నేవీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ‘ఆపరేషన్ సింధూర్’ వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఈ పదోన్నతి దక్కడం విశేషంగా మారింది.
శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అజయ్ కొచ్చార్ జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో నాయకత్వ మార్పులు జరుగుతుండగా, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్గా వైస్ అడ్మిరల్ కె. స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హర్యానాలోని కర్నాల్కు చెందిన అజయ్ కొచ్చార్ 1988 జూలైలో భారత నౌకాదళంలో చేరారు.
గన్ డిజైన్, మిస్సైల్ వ్యవస్థల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన ఆయన అనేక కీలక యుద్ధనౌకలకు కమాండర్గా పనిచేశారు. ఐఎన్ఎస్ నషాక్, ఐఎన్ఎస్ విభూతి, ఐఎన్ఎస్ కిర్పన్ వంటి యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన కొచ్చార్, ఐఎన్ఎస్ త్రికండ్కు కమాండింగ్ ఆఫీసర్గా కూడా సేవలందించారు.
అలాగే భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు కూడా కమాండర్గా వ్యవహరించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పశ్చిమ సముద్ర ప్రాంతంలో నౌకాదళ వ్యూహాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ముంబైలోని వెస్ట్రన్ నావల్ కమాండ్ కేంద్రంగా శత్రు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన రూపొందించిన ప్రణాళికలు కీలకంగా నిలిచినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.








