KTR: హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎర్రగడ్డలోని టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజలకు ప్రధాన ఆధారమైతే, బీఆర్ఎస్ హయాంలో అత్యాధునిక సదుపాయాలతో టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లో AIIMS స్థాయి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో టిమ్స్ను రూపకల్పన చేశామని కేటీఆర్ తెలిపారు. సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
సనత్నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
సనత్నగర్ టిమ్స్లో మూడు ప్రత్యేక బ్లాకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 300 ICU బెడ్స్, 16 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, MRI, CT Scan వంటి అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
రోగుల బంధువుల కోసం ధర్మశాల, 1000 కార్లు పార్క్ చేసుకునే పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు చేసే కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్ట్ రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు. మిగిలిన పనులను ప్రస్తుత ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.









