అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’(Truth Social) భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ట్రూత్ సోషల్ మాతృసంస్థ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ (TMTG) తాజా ఆర్థిక నివేదికల్లో తొలి త్రైమాసికంలో దాదాపు 400 మిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3,700 కోట్లకు సమానం. ఈ సంస్థలో డొనాల్డ్ ట్రంప్కు దాదాపు 41 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ఫైలింగ్ ప్రకారం, కంపెనీ ఆదాయం 1 మిలియన్ డాలర్లకు కూడా చేరలేదని వెల్లడైంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.8.7 కోట్లకు సమానం.
ప్రధానంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ పతనం ఈ నష్టాలకు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్లో 1.26 లక్షల డాలర్లకు చేరిన బిట్కాయిన్ విలువ, మార్చి నాటికి 70 వేల డాలర్ల కంటే దిగువకు పడిపోవడం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది.
ప్రస్తుతం ట్రూత్ సోషల్ తొలి త్రైమాసికంలో కేవలం 9 లక్షల డాలర్ల ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. అయితే మరోవైపు కంపెనీ మార్కెట్ విలువ 2.47 బిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో సంస్థ భవిష్యత్ వ్యూహాలపై దృష్టి సారించినట్లు ట్రూత్ సోషల్ సీఈఓ కెవిన్ మెక్గర్న్ తెలిపారు.
కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టి వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే అమెరికాకు చెందిన టీఏఈ టెక్నాలజీ సంస్థతో విలీనంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు.








