Property Tax: ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ ప్రకటిస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. ముఖ్యంగా ఈ రాయితీని గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించడం విశేషం.
ఇప్పటివరకు ఈ సౌకర్యం పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే పరిమితమై ఉండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వర్తింపజేస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును మే 1 నుంచి మే 31లోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది.
గ్రామీణ ప్రజలకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. ప్రజలు ‘స్వర్ణ పంచాయత్’ పోర్టల్ ద్వారా సులభంగా పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. గడువులోపు పన్ను చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుంది.
ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఇదే విధమైన సౌకర్యాన్ని కొనసాగిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లిస్తే 5 శాతం రిబేట్ లభిస్తుంది.
అలాగే 2025-26 వరకు ఉన్న బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ కూడా అమలులో ఉంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.








