Karnataka Accident: కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు సజీవదహనం కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం మధ్యాహ్నం సూర్పూరు తళుక్ పరిధిలోని దేవాపూర్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదం వెంటనే కారులో మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారికి బయటపడే అవకాశం లేకుండా పోయింది.
పోలీసుల వివరాల ప్రకారం, యాద్గిర్ నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న కారు, బెంగళూరు నుంచి కలబురగి వైపు వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు ఇంజిన్లో మంటలు అంటుకుని క్షణాల్లోనే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది.
కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృ….తి చెందగా, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. వీరంతా సిర్వార్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న మరో ఇద్దరిని స్థానికులు సాహసంగా బయటకు తీశారు. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమై అస్థిపంజరంలా మారిపోయింది. బస్సు కూడా భారీగా దెబ్బతిని పాక్షికంగా కాలిపోయింది.
సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
ప్రాథమిక విచారణలో అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చగా, స్థానికంగా కలకలం రేపింది.









