Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు భారీగా రూ.50,713 కోట్లు కేటాయించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
రైతు భరోసాకు రూ.18,000 కోట్లు, చేయూతకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, సన్న వడ్ల బోనస్కు రూ.3,500 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీకి రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు మంజూరు చేశారు. సంక్షేమ పథకాలతో పాటు పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.3,000 కోట్లు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్కు రూ.3,683 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి రంగాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5,000 కోట్లు, స్కాలర్షిప్లకు రూ.4,343 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.2,170 కోట్లు కేటాయించారు.
ఉద్యోగుల హెల్త్ స్కీంకు రూ.1,056 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు, మూసి అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించినట్లు భట్టి పేర్కొన్నారు.
శాఖలవారీగా చూస్తే విద్యారంగానికి రూ.26,674 కోట్లు, వ్యవసాయం మరియు రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,615 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు, పురపాలక మరియు పట్టణాభివృద్ధికి రూ.17,907 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వ్యవసాయం వంటి రంగాలకు సమతుల ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.










