కమాన్పూర్ మండల రొంపకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కొయ్యడ రాజయ్య (53) సోమవారం రాత్రి విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపించేందుకు మంద ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ క్రమంలో, మంద ప్రక్కనే నేలపై నిద్రిస్తున్న రాజయ్యను పాము కాటు వేసింది. నిద్రలోనే అతను మృతి చెందాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
బాధిత కుటుంబ సభ్యులు ఎన్.టీ.పీ.సీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
రాజయ్యకు భార్య స్వరూప, కుమారులు రమేష్, సంజీవ్ ఉన్నారు. కుటుంబాన్ని చూసే కీలక వ్యక్తి మృతి చెందడంతో, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్థులు ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరుతున్నారు.