ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’ బహిరంగ సభలో మాట్లాడుతూ, గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసి తన మాట నిలబెట్టుకున్నానని సగర్వంగా ప్రకటించారు. మార్కాపురం జిల్లా ప్రజలు తనకు అందించిన ఘనస్వాగతం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్, తాను చేతులు కలిపామని, ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమి హవా కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వంద శాతం విజయం సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 1995 నుంచే ఈ ప్రాంత రైతుల కష్టాలను తాను దగ్గరుండి చూశానని, సాగునీటి ఎద్దడిని తీర్చేందుకే వెలిగొండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నానని ఆయన గుర్తు చేశారు.
గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014-19 మధ్య వెలిగొండ పనులను పరుగులు పెట్టించామని, అయితే 2019-24 మధ్య ఆ పనులు పూర్తిగా మూలనపడ్డాయని ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే గత ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి రైతులను పంగనామాలతో మోసం చేశారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ మాట తప్పమని, వెలిగొండ ప్రాజెక్టును రెండు దశల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మార్కాపురం జిల్లా భవిష్యత్తుపై ఆయన తన విజన్ను పంచుకుంటూ, ఈ ప్రాంతాన్ని ఒక ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పండ్ల తోటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతామని తెలిపారు. గత ఏడాది హంద్రీనీవా ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ ఏడాది వెలిగొండను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మంచి చేసే వారికి అండగా ఉంటేనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, ‘చంద్రన్న’ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటాడని ఆయన భరోసా ఇచ్చారు.









