Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. యువత, మహిళలు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17.69 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా యువ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలలో నిలబడటం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ అంతరాయాలు కారణంగా అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ రద్దీ, దీర్ఘకాలం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విజయ్ తెలిపారు. దీంతో అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలంటే పోలింగ్ సమయాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడ్డారు.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారీగా పోలింగ్ నమోదవుతుండగా, విజయ్ చేసిన ఈ విన్నపంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.








