Iran Us Conflict: ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ముందుకు సాగకపోవడంతో ఆ దేశంపై దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశంలోని కీలక సైనిక స్థావరాలను వినియోగించొద్దని యునైటెడ్ కింగ్డమ్ స్పష్టం చేసింది.
దీంతో స్విండన్(Swindon) సమీపంలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్ఫోర్డ్ కేంద్రం నుంచి దీర్ఘశ్రేణి బాంబింగ్ చర్యలకు అవకాశం లేకుండా పోయింది. అలాగే హిందూ మహాసముద్రంలోని డియాగో గార్షియా స్థావరం వినియోగంపైనా యూకే కఠిన వైఖరి అవలంబించింది.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. చర్చలు విఫలమైతే దాడులు తప్పవని హెచ్చరిస్తూ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలను ప్రాంతానికి తరలిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో పది రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఒప్పందం కుదరకపోతే టెహ్రాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రభుత్వం తమ సైనిక స్థావరాలను వినియోగించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
READ MORE:Cocktail 2 | బాలీవుడ్ లో హీట్ పెంచుతున్న రష్మిక – కాక్టెయిల్ 2లో స్పెషల్ క్యారెక్టర్!




