Sukhoi Su-30MKI: అస్సాం రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం కూలిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుఖోయ్-30 ఎంకేఐ(Sukhoi Su-30MKI) యుద్ధవిమానం కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోగా, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది.
గురువారం సాయంత్రం అస్సాంలోని జోర్హాట్ (Jorhat) వైమానిక స్థావరం నుంచి సాధారణ శిక్షణ మిషన్లో భాగంగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే విమానం రాడార్తో ఉన్న సంబంధాలు అకస్మాత్తుగా తెగిపోయాయి.
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం జోర్హాట్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్(Karbi Anglong) కొండ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో రక్షణ బృందాలు ప్రత్యేకంగా చేరుకుని శోధన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైమానిక దళం ధృవీకరించింది.
ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది.









