దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి(Sardar vallabhai patel 150th jayanthi) సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని “మై భారత్”(My Bharat) సంస్థ సమన్వయంతో ఐబి నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర సాగింది.
ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్యతో పాటు అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ‘వందే మాతరం’, ‘జైహింద్’ నినాదాలతో నగరం మార్మోగింది.

తరువాత కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, “సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడు ఆయనే.
హైదరాబాద్ సంస్థానం విలీనంలో కూడా ఆయన పాత్ర అమూల్యం” అని అన్నారు.
కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ, “సర్దార్ పటేల్ సేవలు దేశ ఏకతకు ఆదర్శం. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ‘ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్'(Ek Bharat Shreshtha Bharat)కార్యక్రమం భాగంగా ఐక్యత మార్చ్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
దేశ సమైక్యత వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.
ALSO READ:Montha Cyclone Crop Loss:మొంథా తుపాను బీభత్సం రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం
