Prashant Kishor: బీహార్ రాజకీయాల్లో వ్యూహకర్తగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వ్యూహాలతో కాదు.. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగుతోనే ఘన విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై సుమారు 20 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నితిన్ నభిన్ రాజీనామా అనంతరం ఖాళీ అయిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించింది. బీజేపీకి బలమైన కంచుకోటగా పేరున్న బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ ఘన విజయంతో ఆయన తొలి సారిగా శాసనసభ సభ్యుడిగా ఎన్నికై బీహార్ అసెంబ్లీలోకి ప్రవేశించనున్నారు.
రాజకీయ వ్యూహకర్తగా ఎన్నో విజయాలకు బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రజల మద్దతుతో ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితంతో బీహార్లో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: రూ.23,999కే Samsung కొత్త 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి!








