Pahalgam Attack: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ దాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.“ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉగ్రవాదం ముందు భారత్ తలొగ్గదని ఆయన ఘాటుగా ప్రకటించారు.”
గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఈ దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన రేపింది. దాడి అనంతరం పర్యాటక ప్రాంతాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
బాధితులకు నివాళులు.. దేశం ఏకమైంది
దాడి వార్షిక దినం సందర్భంగా బాధిత కుటుంబాలు స్మారక స్థలానికి చేరుకుని నివాళులు అర్పించాయి. ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా ద్వారా సానుభూతి తెలియజేస్తూ, బాధితులను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.
ఉగ్రవాదంపై కఠిన వైఖరి
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఏకమై ఉందని, ఉగ్రవాదుల యత్నాలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు.
హై అలర్ట్లో కాశ్మీర్
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక దళాలు పహారా కాస్తూ, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాల్ సరస్సు (Dal Lake) పరిసరాల్లో భద్రత మరింత పెంచారు.
పర్యాటకుల కోసం కొత్త భద్రతా విధానం
పర్యాటకుల్లో నమ్మకం పెంచేందుకు అధికారులు QR కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ద్వారా పర్యాటకులు, స్థానిక వ్యాపారుల వివరాలను సులభంగా ధృవీకరించవచ్చు.
పహల్గాం మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి
బైసరన్ వ్యాలీ (Baisaran Valley) సమీపంలో స్మారక శిలాఫలకం ఏర్పాటు చేసి, మృతుల జ్ఞాపకాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం భద్రతా చర్యలతో పరిస్థితులు సాధారణమవుతుండగా, దేశం నలుమూలల నుంచి పర్యాటకులు మళ్లీ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.








