PM Modi: దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న ప్రశ్నాపత్రాల లీక్(Paper Leak) ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు(Fast-Track Courts)లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని, పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే వారిపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పేపర్ లీక్లకు పాల్పడిన నిందితులను త్వరగా చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్షలు పడేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించినట్లు మోడీ తెలిపారు. ఇప్పటికే ఈ తరహా నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రారంభించిందని, ఇకపై అమలు మరింత కఠినంగా ఉంటుందని పేర్కొన్నారు.
విద్యార్థుల కష్టాన్ని వృథా చేసే ప్రయత్నాలను ఏ మాత్రం సహించబోమని, యువత భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, దోషులకు వేగంగా శిక్షలు విధించడం ద్వారా పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.








