అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీకి చెందిన పెదగరువు PVTG ఆదివాసి గిరిజన గ్రామస్తులు మంచినీటి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. 13 కుటుంబాలు, 60 మంది జనాభా కలిగిన ఈ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో, కొండ దిగుతూ గడ్డలో షెలము తీసుకొని నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవిన్యూ రికార్డుల్లో గ్రామం లేకపోవడంతో మంచినీటి స్కీమ్లకు వీలుకాదని అధికారులు చెప్పడం బాధాకరమని గిరిజనులు తెలిపారు.
2019లో గ్రామస్తులు స్వయంగా శ్రమదానం చేసి 40 అడుగుల బావి నిర్మించుకున్నారు. ఈ విషయం మీడియాలో ప్రచారమయ్యాక, అధికారులు 15వ ఆర్థిక సంఘం నిధులతో బావికి మోటార్, ఇనుప గొట్టాల ద్వారా నీటి సరఫరా చేశారు. అయితే, కొంతకాలానికే గొట్టాలు తుప్పుపట్టి నీరు బురదగా మారిపోయింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు స్పందించకపోవడంతో గిరిజనులు మళ్లీ మానవశ్రమతో గడ్డలో షెలము తీసుకొని నీరు తాగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
తాగునీటి కోసం గిరిజన మహిళలు నితారు కొండలు ఎక్కి దిగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కిలో అనూష, కిలో రష్మీ, సేదర దేవి ప్రభుత్వాన్ని కోరారు. జల జీవన్ మిషన్ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, కొండ గ్రామాల్లో మాత్రం తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, ఖాళీ బిందువులతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తామని గిరిజనులు హెచ్చరించారు.
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు, మండల కార్యదర్శి ఈ. చిరంజీవి మాట్లాడుతూ, తక్షణమే ప్రభుత్వం స్పందించి పెదగరువు గ్రామానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, రోలుగుంట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని గిరిజనులు హెచ్చరించారు.








