Kishan Reddy: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.
నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
చర్లపల్లి స్టేషన్ను నగరానికి నాలుగో ప్రధాన టెర్మినల్గా రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా, 2025 జనవరిలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. అయితే ప్రయాణికుల రాకపోకలకు రహదారి సదుపాయం సరిపడా లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
FCI గోడౌన్ రోడ్డు నుంచి కొత్త భవనం వరకు 200 అడుగుల రహదారి, భరత్ నగర్ వైపు 100 అడుగుల రహదారి విస్తరణ అవసరమని సూచించారు. అలాగే MMTS ప్లాట్ఫాం వైపు ఉన్న ఇరుకైన మార్గాన్ని 100 మీటర్ల వెడల్పు, 700 మీటర్ల పొడవుతో అభివృద్ధి చేయాలని కోరారు.
పార్కింగ్ కోసం స్టేషన్ ఇరువైపులా 5.7 ఎకరాల భూమి కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైల్వే శాఖ ఇప్పటికే రూ.4 కోట్లు చెల్లించినందున నీటి కనెక్షన్ వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రూ.715 కోట్లతో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఆల్ఫా హోటల్ నుంచి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కోరారు.
గతంలోనూ ఈ విషయంపై పలుమార్లు లేఖలు రాసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రయాణికుల సౌకర్యం కోసం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిని కోరారు.








