karnataka ban social media: సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకుంటూ కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఆయన తన 17వ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వేదికలపై గడుపుతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వారి మనస్తత్వం, చదువు, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారని సీఎం తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆస్ట్రేలియాలో కూడా 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై ప్రభుత్వం పరిమితులు విధించిన విషయం తెలిసిందే. అదే విధంగా భారత్లో కూడా ఇలాంటి నియంత్రణ చర్యలు అవసరమని కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్లో ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మరోవైపు ఏపీ, గోవా రాష్ట్రాలు కూడా సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే అంశంపై గతంలో చర్చించినట్లు సమాచారం.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా అధ్యయనం నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు.
పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అమలు చేయాలా అనే విషయంపై వారి అభిప్రాయాలను కూడా కోరారు. ఈ చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఈ నిర్ణయం అమలు విధానం, నియమాలు త్వరలో ప్రకటించే అవకాశముంది.









