Kavitha visits Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న మనోవేదనకు ముగింపు లభించిందని చెప్పారు. ఇటీవల తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెల్లవారుజామున తన భర్తతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా తాను ఎదుర్కొన్న కష్టాల నుంచి ఇప్పుడు ఉపశమనం లభించిందని తెలిపారు.
ఢిల్లీ మద్యం కేసు లో (Delhi Liquor Policy Case) లో కోర్టు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో శ్రీవారికి చేసిన మొక్కులు తీర్చేందుకు కాలినడకన తిరుమలకు వచ్చినట్లు వెల్లడించారు. స్వామివారి కృపతో తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కొత్త మార్పులకు శ్రీకారం చుడతామని కవిత పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
భక్తి, రాజకీయ సంకల్పం రెండింటినీ కలిపి ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతానని ఆమె చెప్పారు. తిరుమల దర్శనం అనంతరం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.









