India and Indonesia: భారత్ రక్షణ రంగ సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో తన సత్తాను చాటిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిపై ఇండోనేసియా ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్తో పాటు భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అస్త్ర ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల కొనుగోలుకు ఆ దేశం ముందుకు వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ జకార్తా పర్యటనలో భాగంగా ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ, సాంకేతికత, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు, ఆహార భద్రత, ఔషధ రంగం వంటి పలు అంశాలపై ఇరు దేశాలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా ఇండోనేసియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు భారత్ అంగీకరించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ క్షిపణులు తమకు ఉపయోగపడతాయని ఇండోనేసియా భావిస్తోంది. అలాగే గగనతల రక్షణ అవసరాల కోసం అస్త్ర క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్, ఇతర స్వదేశీ ఆయుధ వ్యవస్థల పనితీరును పరిశీలించిన అనంతరం ఇండోనేసియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత రక్షణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మరింత ఆదరణ పెరుగుతోంది. రక్షణ రంగంతో పాటు కీలక ఖనిజాల రంగంలోనూ ఇరు దేశాలు సహకారాన్ని విస్తరించనున్నాయి. ఇండోనేసియాలో స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సిద్ధమైంది.
అంతేకాకుండా మలక్కా జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సబాంగ్ పోర్టు అభివృద్ధిలో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ చర్యలు భారత్కు సముద్ర భద్రతతో పాటు వాణిజ్య పరంగా కూడా కీలక ప్రయోజనాలను అందించనున్నాయి. రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, ఎన్నికల నిర్వహణ వంటి అనేక రంగాల్లో భారత్-ఇండోనేసియా భాగస్వామ్యం మరింత బలపడనుంది.








