Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. టీ20 మ్యాచ్లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించినట్లు, పసిడి–వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ క్రమంలో వెండి తొలిసారి రూ.3 లక్షల మార్కును దాటగా, బంగారం కూడా రూ.1.50 లక్షల స్థాయిని అధిగమించింది.
తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు సంబరాలు చేసుకుంటుండగా, ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న మధ్యతరగతి వర్గం ప్రేక్షకులుగా మిగిలిపోయింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో మార్చి డెలివరీ కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.9,674 పెరిగి రూ.3.19 లక్షలకు చేరువైంది. ఫిబ్రవరి డెలివరీ బంగారం ధర రూ.2,560 పెరిగి రూ.1.48 లక్షలకు చేరింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.1.50 లక్షలు దాటగా, వెండి రూ.3.15 లక్షల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,714 డాలర్ల వద్ద, వెండి ఔన్సు 94.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 91 మార్కు దాటడం కూడా దేశీయ ధరల పెరుగుదలకు కారణంగా మారింది.
ప్రపంచ రాజకీయ అనిశ్చితి, భద్ర పెట్టుబడులపై ఆసక్తి పెరగడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త ఇంధన రంగాల నుంచి వెండికి పెరిగిన డిమాండ్ ధరల ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
