Evening BTech: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో “సాయంత్రం బీటెక్ కోర్సులు“(Evening BTech courses) ప్రారంభించడానికి ఆమోదం ఇచ్చింది. ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” సమ్మతితో విద్యాశాఖ “GO నంబర్ 30” జారీ చేసింది. ప్రతి కళాశాలకు 1 నుంచి 5 బీటెక్ కోర్సులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఒక్కో కోర్సులో కనీసం 15, గరిష్టంగా 60 సీట్లు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభమవుతాయి. సీట్ల భర్తీ కోసం ఒక్కటే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలి.
ప్రవేశ అర్హతలు:
పాలిటెక్నిక్ పూర్తిచేసి కనీసం ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు సాయంత్రం బీటెక్ కోర్సులలో చేరవచ్చు. బీటెక్ పూర్తి చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో కూడా చేరవచ్చు. ఈ కోర్సులు సాయంత్రం తరగతులుగా ఉంటాయి. రెగ్యులర్ బీటెక్ ఫీజులు ఈ కోర్సులకు వర్తిస్తాయి. ఎంటెక్ కోర్సుల ప్రవేశ పరీక్షలు “ఉస్మానియా విశ్వవిద్యాలయం” సెట్ కన్వీనర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి.
కళాశాలలు:
సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఎంవీఎస్ఆర్, స్టాన్లీ, మెథడిస్ట్, ఎంజీఐటీ, మాతృశ్రీ, అబ్దుల్ కలాం, జయప్రకాశ్ నారాయణ్ (మహబూబ్నగర్), అనుబోస్ (పాల్వంచ), సిద్ధార్థ, సెయింట్ పీటర్స్. ఈ నిర్ణయం విద్యార్థులకు సాయంత్రం బీటెక్ చదువులో అవకాశం కలిగిస్తూ, వృత్తిపరంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుంది.






