China Bangladesh: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో దేశాలు తమ రక్షణ సామర్థ్యాల బలోపేతంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలో కూడా వ్యూహాత్మక సమీకరణలు మారుతున్నాయి. తాజాగా చైనా–బంగ్లాదేశ్(China Bangladesh) మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం(Defence Agreement) భారత్ భద్రతా ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బంగ్లాదేశ్ వైమానిక దళం, చైనా ప్రభుత్వ రంగ సంస్థ CETC ఇంటర్నేషనల్తో ప్రభుత్వాల మధ్య (G2G) ఫ్రేమ్వర్క్లో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్లో డ్రోన్లు (UAVలు) తయారీ, అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత సాంకేతికతను బదిలీ చేయనున్నారు.
ఢాకాలోని బంగ్లాదేశ్ వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని ISPR అధికారికంగా ప్రకటించింది.
రక్షణ రంగంలో స్వయం ఆధారితత సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ, భారత రాజకీయ, భద్రతా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా డ్రోన్ టెక్నాలజీ భారత్ సరిహద్దులకు సమీపంగా వినియోగంలోకి రావడం నిఘా, భద్రతా కోణంలో సవాళ్లను సృష్టించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు రాజకీయ సంకేతం ఇస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ వ్యూహాత్మక దిశపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి.
దక్షిణాసియా భద్రతా సమీకరణలో ఈ ఒప్పందం ఎంతవరకు కీలకంగా మారుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.
ALSO READ:Medaram Jatara: నేటి నుంచి సమ్మక్క–సారలమ్మ మహాజాతర







