Census 2027: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న “జనగణన–2027” కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రగతి’, ‘వికాస్’ పేర్లతో రెండు అధికారిక చిహ్నాలను ఆవిష్కరించారు.
మహిళా, పురుష జనగణకులను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిహ్నాలు, దేశ అభివృద్ధిలో మహిళలు-పురుషులు సమానంగా భాగస్వామ్యం కావాలనే సందేశాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ చిహ్నాలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఇక ఈసారి జనగణన ప్రక్రియను మొదటిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనుండటం ప్రత్యేకత. ఇందుకోసం Centre for Development of Advanced Computing (సీడాక్) అభివృద్ధి చేసిన పలు డిజిటల్ సాధనాలను కూడా అమిత్ షా విడుదల చేశారు.
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా డిజిటల్ మ్యాపింగ్కు సహాయపడే “హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ (HLBC)” ను ఆవిష్కరించారు. గృహాల వివరాలను సేకరించి అప్లోడ్ చేయడానికి ఉపయోగపడే ‘హెచ్ఎల్ఓ’ అనే ఆఫ్లైన్ మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు.
అదే సమయంలో ప్రజలు తమ కుటుంబ, వ్యక్తిగత వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు “సెల్ఫ్ ఎన్యూమరేషన్ (SE) పోర్టల్” అందుబాటులోకి తీసుకువచ్చారు.
జనగణన కార్యక్రమం పురోగతిని పర్యవేక్షించేందుకు “సెన్సస్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్” ను కూడా విడుదల చేశారు.
జనగణనలో తొలి దశగా హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండో దశగా జరిగే జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమై, మార్చి 1 అర్ధరాత్రి వరకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.









